భువనగిరి :
పదవ తరగతి విద్యార్థుల భవిష్యత్తు పునాదిని మరింత బలపర్చే దిశగా జిల్లా కలెక్టర్ హనుమంత రావు కీలక అడుగు వేశారు. పదో తరగతిలో మెరుగైన ఫలితాలే లక్ష్యంగా ‘జట్టు’ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.
మంగళవారం బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామంలో పదవ తరగతి విద్యార్థులను జట్టుగా ఏర్పాటు చేసిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…పదవ తరగతి అనేది విద్యార్థుల జీవితంలో అత్యంత కీలక మలుపు అని, ఇక్కడ సాధించే విజయం భవిష్యత్తు బాటను నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో అధికారులు, ఉపాధ్యాయులు, విద్యావంతులైన యువత, గ్రామస్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జట్టుగా ఏర్పడి, ఇప్పటి నుంచే వార్షిక పరీక్షల వరకు విద్యార్థులను నడిపించటం అభినందనీయమని అన్నారు.
సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ నిరంతర మార్గనిర్దేశం చేయాలన్నారు. చదువులో వచ్చే ప్రతి సందేహాన్ని వెంటనే నివృత్తి చేస్తూ, పదో తరగతి పాస్ అయ్యే వరకు పూర్తి బాధ్యత తీసుకోవాలని సూచించారు.
తల్లిదండ్రులు పిల్లల చదువుకు అనుకూలమైన వాతావరణాన్ని ఇంట్లోనే కల్పించాలని, టీవీ, సెల్ఫోన్లకు దూరంగా ఉంచి చదువుపై పూర్తిగా దృష్టి పెట్టేలా చూడాలని కోరారు. విద్యార్థులు ఆటపాటలను పక్కనపెట్టి క్రమశిక్షణతో చదవాలని, ప్రతిరోజూ ఉదయం నాలుగు గంటలకు లేచి చదివే అలవాటు జీవితంలో ముందుకు తీసుకెళ్తుందని కలెక్టర్ హితవు పలికారు.పదవ తరగతి ఉత్తీర్ణతతోనే ఉన్నత చదువులకు మార్గం సులభమవుతుందని, జీవితంలో స్థిరపడాలంటే పదో తరగతిలో మంచి మార్కులు సాధించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి