ఓటు హక్కు విలువను చాటిన జాతీయ ఓటరు దినోత్సవం
ఓటు హక్కు విలువను చాటిన జాతీయ ఓటరు దినోత్సవం
స్థానికం బృందం
పట్టణ వీధుల్లో ప్రజాస్వామ్య గళం
స్థానికం ప్రధాన ప్రతినిధి
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత పవిత్రమైనదని, దాని విలువను ప్రతి పౌరుడు గుర్తించాలని స్థానిక సంస్థల, రెవిన్యూ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పిలుపునిచ్చారు. ఓటు అనేది పాలకులను నిర్ణయించే ఆయుధమని, దీనిని నిర్లక్ష్యం చేస్తే ప్రజాస్వామ్యానికి నష్టం వాటిల్లుతుందని ఆయన స్పష్టం చేశారు.
పదహారవ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి పట్టణ ప్రధాన వీధుల గుండా ఘనంగా ర్యాలీ నిర్వహించారు. ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా సాగిన ఈ ర్యాలీలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ పౌరులు, విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని, ఎన్నికల సమయంలో తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ర్యాలీ ద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు. రాజ్యాంగం ప్రజలకు కల్పించిన ఓటు హక్కు ద్వారానే తమకు నచ్చిన పాలకులను ఎన్నుకునే అవకాశం ఉందని, అందుకే ఒక్క ఓటు కూడా అమూల్యమేనని వివరించారు.
యువతలో ఓటు హక్కు ప్రాముఖ్యతపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. యువత చైతన్యంతోనే ప్రజాస్వామ్యం బలపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో నిరంతరం ఓటు హక్కును వినియోగిస్తున్న సీనియర్ పౌరులను, కొత్తగా నమోదైన యువ ఓటర్లను జిల్లా యంత్రాంగం తరపున సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. కొత్త ఓటర్లకు ఎన్నికల గుర్తింపు పత్రాలను అందించారు.ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగిస్తామని పాల్గొన్నవారితో ప్రతిజ్ఞ చేయించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడే బాధ్యత ప్రతి పౌరుడిదేనని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి