నిస్వార్థ సేవకు ప్రతీక… మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్రజాభిమానం పొందిన గుర్రం యాదగిరి రెడ్డి
నిస్వార్థ సేవకు ప్రతీక… మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్రజాభిమానం పొందిన గుర్రం యాదగిరి రెడ్డి
Editor Desk
రామన్నపేట మండలంలో సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరు నరసింహ మాట్లాడుతూ, నిస్వార్థానికి, నిజాయితీకి మారుపేరుగా నిలిచిన సిపిఐ మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరి రెడ్డి సేవలను స్మరించుకున్నారు.
1985 నుండి 1999 వరకు రామన్నపేట నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన గుర్రం యాదగిరి రెడ్డి గారు, ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా అన్ని పార్టీల కార్యకర్తలకు, తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికీ సమానంగా సేవలందించిన నాయకుడని తెలిపారు. రైతు సంఘానికి ఆయన అందించిన సేవలు అమూల్యమైనవని, ప్రజల మధ్య అందుబాటులో ఉంటూ నిజాయితీతో సేవ చేయడం వల్లనే వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారని అన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రజలకు చేరువగా ఉంటూ సేవ చేయడం కమ్యూనిస్టు నాయకుల చిత్తశుద్ధి, నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. గుర్రం యాదగిరి రెడ్డి గారి జీవితం నేటి యువతకు, రాజకీయ నాయకులకు ఆదర్శమని చెప్పారు.
అలాగే, గతంలో కొన్ని రాజకీయ కారణాల వల్ల రామన్నపేట నియోజకవర్గాన్ని విభజించారని గుర్తుచేస్తూ, ప్రస్తుతం పునర్విభజనలో భాగంగా రామన్నపేటను తిరిగి నియోజకవర్గంగా సాధించుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో అందరూ కలిసికట్టుగా పోరాడి నియోజకవర్గాన్ని తిరిగి సాధించుకోవాలని పిలుపునిచ్చారు.
రామన్నపేట నియోజకవర్గ సాధన సమితిలో సిపిఐ ముఖ్య పాత్ర పోషిస్తున్నదని, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ, డీఎస్పీ, బీఎస్పీ, టీజేఎస్ వంటి అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు ఈ ఉద్యమంలో భాగస్వాములై పోరాటం కొనసాగిస్తున్నారని చెప్పారు.
మండలంలోని అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిపైకి వచ్చి, ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ముందుకు సాగి ముందుగా నియోజకవర్గాన్ని సాధించుకోవడం లక్ష్యంగా పెట్టుకోవాలని, అదే మన అభివృద్ధికి దారి తీస్తుందని, నియోజకవర్గ సాధనే మన అంతిమ లక్ష్యమని ఊట్కూరు నరసింహ స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి