"న్యాయ దేవతపై మచ్చలు: ప్రజాస్వామ్యానికి ప్రాణాంతక గాయం!"- సుప్రీంకోర్ట్ న్యాయవాది కృష్ణస్వామి
"న్యాయ దేవతపై మచ్చలు: ప్రజాస్వామ్యానికి ప్రాణాంతక గాయం!"- సుప్రీంకోర్ట్ న్యాయవాది కృష్ణస్వామి
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
న్యాయవ్యవస్థ కే అవినీతి మరకలు అంటుకుంటే, అది కేవలం ఒక వ్యవస్థ వైఫల్యం కాదు – అది ప్రజాస్వామ్యానికి పడిన ప్రాణాంతక గాయం... రచయిత... ప్రజా న్యాయవాది... సోషల్ యాక్టివిస్ట్... లాయర్ కృష్ణ స్వామి.. సుప్రీమ్ కోర్ట్.. 9550572981. ఇటీవల Lok Sabhaలో వెల్లడైన గణాంకాలు ఈ దేశాన్ని నిద్రలేపాల్సిన శంఖారావం. గత పదేళ్లలో Chief Justice of India కార్యాలయానికి వేల సంఖ్యలో సిట్టింగ్ న్యాయమూర్తులపై ఫిర్యాదులు వచ్చాయన్న వాస్తవం, మనం ఇప్పటివరకు గట్టిగా నమ్ముకుంటూ వచ్చిన “న్యాయవ్యవస్థ అచంచలమైనది” అన్న భావనను లోపల నుంచి కుదిపేస్తోంది.
న్యాయస్థానం అంటే ప్రజలకు చివరి ఆశ. పరిపాలన విఫలమైనా, రాజకీయాలు దారి తప్పినా, పోలీసు వ్యవస్థ చేతులెత్తేసినా, చివరికి ఒక సామాన్యుడు తలెత్తి చూస్తాడు – కోర్టు వైపు. అక్కడ న్యాయం దొరుకుతుందనే నమ్మకమే ప్రజలను చట్టబద్ధ మార్గంలో నిలబెడుతుంది. ఆ నమ్మకమే సమాజాన్ని కట్టిపడేసే అదృశ్య శక్తి. అదే నమ్మకం చీలిపోయిన రోజు, ప్రజాస్వామ్యం కేవలం రాజ్యాంగ పుస్తకాల్లో మిగిలిపోయే అక్షరాల సమాహారమవుతుంది.
న్యాయవ్యవస్థలో అవినీతి ప్రవేశిస్తే దాని ప్రభావం పరిమితంగా ఉండదు. అది ఒక వైరస్లా అన్ని వ్యవస్థలకు అంటుకుంటుంది. చట్టం అమలు చేసే యంత్రాంగం ధైర్యం కోల్పోతుంది. రాజకీయ అధికారానికి అదుపు ఉండదు. పరిపాలనకు భయం పోతుంది. చివరికి ప్రజలపై రక్షణ కవచం పూర్తిగా తొలగిపోతుంది. అప్పుడు అరాచకం సహజమవుతుంది. హింస ఒక సాధారణ దృశ్యమవుతుంది. దోపిడీ, దొంగతనాలు, బెదిరింపులు పరిపాలనా విధానాలుగా మారతాయి. మానభంగాలు వార్తలు కాకుండా రోజువారీ సంఘటనలవుతాయి. మర్దర్లు శిక్షలేని చర్యలవుతాయి. ప్రజల ఆస్తులు చట్టం పేరుతో కాకుండా బలవంతం పేరుతో దోచుకునే ఆటవిక పాలన పుట్టుకొస్తుంది.
న్యాయవ్యవస్థ కేవలం ఒక శాఖ కాదు. అది అన్ని వ్యవస్థలను కాపాడే దైవస్వరూపం. శాసన వ్యవస్థను అదుపులో ఉంచేది న్యాయవ్యవస్థ. కార్యనిర్వాహక వ్యవస్థకు గడ్డు పెట్టేది న్యాయవ్యవస్థ. అధికార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేది న్యాయవ్యవస్థ. అలాంటి న్యాయ దేవత ముఖం మీదే మచ్చలు కనిపిస్తే, సమాజం మొత్తం అంధకారంలోకి జారిపోతుంది. ప్రజల ఆశా దీపం మసకబారితే, దారితెలియని చీకట్లో ప్రజలు చిత్తవుతారు.
ఇక్కడ భయపడాల్సింది ఫిర్యాదుల సంఖ్య కాదు. భయపడాల్సింది వాటిపై మౌనం. ఫిర్యాదులు రావడం సహజమే. మానవ వ్యవస్థలో లోపాలు ఉండటం సహజమే. కానీ ఆ లోపాలను సరిదిద్దే ప్రక్రియ కనిపించకపోతేనే ప్రమాదం. న్యాయవ్యవస్థ తనను తాను శుద్ధి చేసుకునే ధైర్యం చూపించకపోతే, ఆ వ్యవస్థపై ప్రజల విశ్వాసం క్రమంగా కరిగిపోతుంది. విశ్వాసం కరిగిన సమాజంలో చట్టానికి విలువ ఉండదు. భయానికి మాత్రమే విలువ ఉంటుంది.
న్యాయమూర్తి అంటే పదవి కాదు, అది త్యాగం. అది నియంత్రణ. అది నైతికత. ఒక న్యాయమూర్తి తప్పు చేస్తే, అది వ్యక్తిగత తప్పు మాత్రమే కాదు – అది వ్యవస్థ మీద పడిన మచ్చ. ఆ మచ్చను దాచిపెట్టడం ద్వారా వ్యవస్థను కాపాడినట్టు కాదు. ఆ మచ్చను వెలుగులోకి తెచ్చి శుద్ధి చేయడమే నిజమైన రక్షణ. న్యాయవ్యవస్థపై విమర్శ న్యాయవ్యవస్థకు శత్రుత్వం కాదు. అది న్యాయవ్యవస్థను బతికించేందుకు చేసే చివరి ప్రయత్నం.
న్యాయం జరగడమే కాదు, న్యాయం జరుగుతుందన్న నమ్మకం నిలబడాలి. ఆ నమ్మకం నిలబడాలంటే పారదర్శకత అవసరం. జవాబుదారీతనం అవసరం. ప్రజలకు సమాధానం చెప్పే సంస్కృతి అవసరం. లేకపోతే, సన్మార్గంలో ప్రజలను నడిపించాల్సిన వ్యవస్థలన్నీ అదుపు తప్పి దుర్మార్గం వైపు జారుతాయి. చట్టం పుస్తకంగా మిగిలిపోతుంది. న్యాయం ఒక జ్ఞాపకంగా మారుతుంది.
కాబట్టి ఇది హెచ్చరిక. ఇది ఆహ్వానం కాదు, అభ్యర్థన కాదు. ఇది ఒక కేక. మేలుకో న్యాయ దేవతా. నిన్ను నమ్ముకుని నిలబడిన ప్రజల చూపు మసకబారుతోంది. నీ తూకం ఒరిగితే సమాజం ఒరిగిపోతుంది. నీ కళ్ళపై గంతలు జారితే చీకటి రాజ్యం మొదలవుతుంది. తస్మాత్ జాగ్రత్త. న్యాయవ్యవస్థ శుద్ధి కావాలి. న్యాయం నిలబడాలి. ప్రజాస్వామ్యం బతకాలంటే న్యాయ దేవత మళ్లీ వెలుగులోకి రావాలి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి