నల్గొండలో ఉద్యోగాల పేరిట భారీ మోసం – పోలీసుల దాడులకు సిద్ధం
నల్గొండలో ఉద్యోగాల పేరిట భారీ మోసం – పోలీసుల దాడులకు సిద్ధం
Komidala Mahender reddy
నల్గొండ జిల్లాలో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని నిర్వహించిన ఉద్యోగాల కుంభకోణం వెలుగులోకి రావడంతో పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు మోసగాళ్లపై స్పెషల్ డ్రైవ్ చేపట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
దేవాదాయ శాఖతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి, ఒక్కొక్కరి నుంచి రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేసిన గ్యాంగ్ కార్యకలాపాలు జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. మండలాల వారీగా ఏజెంట్లను నియమించి చైన్ సిస్టమ్ ద్వారా కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ప్రాథమిక విచారణలో తేలింది.
ఈ ముఠా చేతిలో వందలాది మంది నిరుద్యోగులు మోసపోయినట్లు సమాచారం. బాధితులు ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదులు అందజేస్తున్నారు. నకిరేకల్, కట్టంగూరు, నార్కట్పల్లి, చిట్యాల పోలీస్ స్టేషన్ల వద్ద బాధితుల రద్దీ పెరుగుతోంది.
బాధితుల ఫిర్యాదుల మేరకు పలువురు నిందితులపై ఇప్పటికే కేసులు నమోదు చేశారు. ప్రధాన సూత్రధారులు గోవాకు పరారైనట్లు సమాచారం అందుతోంది. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగనున్నాయి.
జిల్లాలో కలకలం రేపుతున్న ఈ ఉద్యోగాల మోసం కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. నిరుద్యోగులు ఇలాంటి మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి