మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కుడకుడలో పోలీస్ ఫ్లాగ్ మార్చ్
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కుడకుడలో పోలీస్ ఫ్లాగ్ మార్చ్
Biksham
ప్రశాంత, స్వేచ్ఛాయుత ఎన్నికలకే చర్యలు
ప్రజలు నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకోవాలి
ఈనెల 11న జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజల్లో భద్రతపై నమ్మకం కల్పించడం, ఎన్నికల నియమాలను పటిష్టంగా అమలు చేయడం, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా నిష్పక్షపాతంగా నిర్వహించాలనే లక్ష్యంతో సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని కుడకుడ గ్రామంలో భారీ పోలీస్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
జిల్లా ఎస్పీ నర్సింహ ఆదేశాల మేరకు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ ఫ్లాగ్ మార్చ్ కొనసాగింది. మున్సిపాలిటీలోని ప్రధాన రహదారులు, సమస్యాత్మక ప్రాంతాలు, జనసాంద్రత అధికంగా ఉండే ప్రాంతాల మీదుగా పోలీస్ బలగాలు కవాతు నిర్వహించాయి.
ఈ సందర్భంగా డివిజన్ డిఎస్పీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా నిర్భయంగా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేసినా, అసాంఘిక శక్తులు తలదూర్చినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.మున్సిపాలిటీ పరిధిలో సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ప్రజల రక్షణే తమ ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళిని గౌరవిస్తూ శాంతియుత వాతావరణంలో ఎన్నికలు విజయవంతం అయ్యేలా ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట డివిజన్ డిఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ మరియు రూరల్ ఇన్స్పెక్టర్లు వెంకటయ్య, రాజశేఖర్, సూర్యాపేట సర్కిల్ ఎస్సైలు, పట్టణ ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి