మల్లిఖార్జున స్వామి తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవం
మల్లిఖార్జున స్వామి తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవం
స్థానికం బృందం
సిరిపురంలో ఆధ్యాత్మిక శోభ
రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామం ఆధ్యాత్మిక కళకళలతో విరాజిల్లుతోంది. శ్రీ భ్రమరాంబిక సమేత మల్లిఖార్జున స్వామి తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమై భక్తుల మనసులను పరవశింపజేస్తున్నాయి.
మాఘమాసం శుద్ధ ఏకాదశి నుండి శుద్ధ త్రయోదశి వరకు నాలుగు రోజులపాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలు గ్రామాన్ని భక్తిసాగరంగా మార్చాయి. తొలి రోజున గణపతి పూజ, పుణ్యావాచనం, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠాపన, ధ్వజారోహణ కార్యక్రమాలు వేదమంత్రోచ్ఛారణల నడుమ వైభవంగా జరిగాయి. చతుర్వేద స్వస్తి, తీర్థప్రసాద భరణంతో ఉత్సవాలకు శుభారంభం పలికారు.
రెండో రోజున స్వామివారికి రుద్రాభిషేకం, మంగళస్నానాలు, విశేష అలంకరణతో పాటు ఎదురుకోలు ఉత్సవం నిర్వహించగా, సాయంత్రం మూలమంత్ర హోమం అనంతరం శ్రీ భ్రమరాంబిక సమేత మల్లిఖార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా సాగింది. కళ్యాణానంతరం నిర్వహించిన మహాదాశీర్వచనంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. అనంతరం మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.
మూడో రోజున పరివార దేవతల మూలమంత్ర హోమాలు, చండీ హోమం, రుద్ర హోమం, మహాపూర్ణాహుతి, త్రిశూల స్నాన కార్యక్రమాలు నిర్వహించగా, సాయంత్రం గ్రామ ఊరేగింపు ఉత్సవ వాతావరణాన్ని మరింత పెంచింది.
చివరి రోజున స్వామివారి హారతి, పవళింపు సేవా కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.యాగ్నిక బ్రహ్మశ్రీ నాగార్జున ఆచార్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించబడగా, ఆలయ అర్చకులు శ్రీ జెల్ల అంజయ్య గారు విధివిధానాలు చేపట్టారు. శ్రీ విశాఖ శారదా పీఠాధిపతుల ఆశీస్సులతో ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి.
ఈ కార్యక్రమాలకు శ్రీమతి ఏళ్ళ నాగమణి, శ్రీ ఏళ్ళ బుచ్చిరెడ్డి దంపతులు ఆహ్వానదాతలుగా వ్యవహరించగా, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, పురప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి