లేబర్ కోడ్లు రద్దు అయ్యేంతవరకు ఐక్య పోరాటాలు కొనసాగాలి
లేబర్ కోడ్లు రద్దు అయ్యేంతవరకు ఐక్య పోరాటాలు కొనసాగాలి
Biksham
సంపన్నుల పక్షపాత చట్టాలను తిప్పికొట్టాలి: సిటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లేబర్ కోడ్లను పూర్తిగా రద్దు చేసేంతవరకు కార్మిక వర్గం ఐక్యంగా పోరాటాలు కొనసాగించాలని సిటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ పిలుపునిచ్చాడు. మోదీ ప్రభుత్వం సంపన్నులకు సంపదను పెంచే విధంగా చట్టాలు రూపొందిస్తూ కార్మికులను కార్పొరేట్ కంపెనీలకు కట్టుబానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తోందని విమర్శించాడు.దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల పిలుపు మేరకు నిర్వహించిన సార్వత్రిక సమ్మెలో భాగంగా సూర్యాపేట జిల్లాలో సమ్మె విజయవంతమైంది. ఈ సందర్భంగా వాణిజ్య భవన్ నుండి కొత్త బస్టాండ్ వరకు వందలాది మంది కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శనలో భూపాల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించాడు.ఈ సందర్భంగా మాట్లాడుతూ 2014లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బ్రిటిష్ కాలం నాటి పోరాటాల ఫలితంగా సాధించిన 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని పేర్కొన్నాడు. ఈ కోడ్ల ద్వారా పని గంటలు పెంచడం, యూనియన్లు ఏర్పాటు చేయకుండా కార్మికుల సంఖ్య పెంచడం, వేతనాల పెంపును యాజమాన్యాల ఇష్టారాజ్యంగా మార్చడం, భవిష్య నిధి, ఉద్యోగ భద్రత వంటి హక్కులను హరించడం జరుగుతోందని ఆరోపించాడు. కార్మిక శాఖ రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ, కేంద్రం ఏకీకృత విధానం పేరుతో రాష్ట్రాల హక్కులను హరిస్తోందని తెలిపాడు.
బిఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర నాయకుడు వై వెంకటేశ్వర్లు, సిటియు జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి గంటా నాగన్న, ఏఐటియుసి కార్యదర్శి వెంకన్న, ఐఎన్టియు జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ మాట్లాడుతూ లేబర్ కోడ్లు, విత్తన చట్టం, విద్యుత్ సవరణ చట్టం వంటి కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ స్థాయి వరకు పోరాటాలను విస్తరించాలని కోరారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జున రెడ్డి, ఎస్కేఎస్ రాష్ట్ర నాయకుడు ఎం డేవిడ్ కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మట్టిపల్లి సైదులు మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే విధానాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి, అంగన్వాడీ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షురాలు బొలిశెట్టి భాస్కరమ్మ, సిటియు సూర్యాపేట పట్టణ కో కన్వీనర్ శివకృష్ణ కుమార్, పెయింటర్ యూనియన్ అధ్యక్షుడు పాముల ఉపేందర్, బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు నీలా శ్రీనివాస్, ఎల్ఐసి సంఘం అధ్యక్షుడు ప్రభాకర్, పింఛన్ దారుల సంఘం జిల్లా కార్యదర్శి మన్నెం యాదగిరి, ఆశా వర్కర్స్ సంఘం అధ్యక్షురాలు కవిత, ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి వేల్పుల వెంకన్న, ప్రైవేట్ ఉపాధ్యాయుల సంఘం జిల్లా కార్యదర్శి జె నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి