ఇరవై లక్షల పుస్తకాలతో ఒక మనిషి… పద్మశ్రీ గౌరవం పొందిన జ్ఞాన యోధుడు అంకె గౌడ
ఇరవై లక్షల పుస్తకాలతో ఒక మనిషి… పద్మశ్రీ గౌరవం పొందిన జ్ఞాన యోధుడు అంకె గౌడ
స్థానికం బృందం
పుస్తకాలు అంటే ఇష్టం కాదు… పుస్తకాలే జీవితం.
ఆ ఇల్లు ఒక నివాసం కాదు… అది ఒక మహా గ్రంథాలయం.
స్థానికం ప్రధాన ప్రతినిధి
ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి, తన జీవితమంతా జ్ఞానానికి అంకితం చేసి దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ గ్రంథాలయాన్ని నిర్మించాడు. ఆయనే పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన అంకె గౌడ.కర్ణాటక రాష్ట్రం మాండ్యా జిల్లా పాండవపురం సమీపంలోని హరాలహల్లిలో ఏర్పాటు చేసిన అంకె గౌడ జ్ఞాన ప్రతిష్టానం నేడు దేశవ్యాప్తంగా పరిశోధకులు, విద్యార్థులు, సాహితీవేత్తలకు ఆశ్రయంగా మారింది. ఒకే పైకప్పు కింద ఇరవై లక్షలకు పైగా పుస్తకాలు ఉండటం ఈ గ్రంథాలయ ప్రత్యేకత.
సామాన్య జీవితం – అసాధారణ సంకల్పం
రైతు కుటుంబంలో జన్మించిన అంకె గౌడకు చిన్నతనం నుంచే చదువుపై అపారమైన ఆసక్తి. డబ్బుల్లేని రోజుల్లో మిత్రుల సహాయంతో చదువు కొనసాగించారు. పుస్తకాలు కొనలేని స్థితి తనలోని బాధగా మారి, అదే సమాజానికి పుస్తకాలు అందించాలనే సంకల్పంగా మారింది.
తొమ్మిదవ తరగతి నుంచే పుస్తక సేకరణ మొదలుపెట్టిన ఆయన, తన జీతంలో ఎనభై శాతం పుస్తకాల కోసమే ఖర్చు చేశారు. డబ్బులు లేని రోజుల్లో పాల వ్యాపారం చేసి వచ్చిన ఆదాయాన్ని కూడా పుస్తకాలకే వినియోగించారు. ఉద్యోగ విరమణతో వచ్చిన మొత్తం, తన స్థలాల అమ్మకపు సొమ్ము అన్నీ గ్రంథాలయానికే అంకితం చేశారు.
ఇరవై లక్షల పుస్తకాలు…
అన్ని విషయాలపై అపార జ్ఞానం
ఈ గ్రంథాలయంలో ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకూ సాహిత్యం, వేదాలు, పురాణాలు, తత్వశాస్త్రం, వైద్య విజ్ఞానం, పోటీ పరీక్షల పుస్తకాలు, జీవచరిత్రలు, పిల్లల పుస్తకాలు ఉన్నాయి. రామాయణం, మహాభారతం, భగవద్గీతపై వేలాది రచనలు, పాతకాలపు అరుదైన గ్రంథాలు, నిఘంటువులు, పత్రికల తొలి సంచికలు భద్రంగా నిల్వ ఉన్నాయి.
పుస్తకాలతో పాటు పాత నాణేలు, కరెన్సీ నోట్లు, తపాలా బిళ్ళలు, పాత యంత్రాలు, సినిమా పోస్టర్లు వంటి చారిత్రక వస్తువులు కూడా ఇక్కడ చూడవచ్చు. ఈ గ్రంథాలయం ఒక జ్ఞాన మందిరంగా, సరస్వతి ఆలయంగా పేరొందింది.
ప్రతిరోజూ జ్ఞాన సేవ
ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు గ్రంథాలయం అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంటుంది. రోజుకు సుమారు రెండు వందల మంది పాఠకులు ఇక్కడ జ్ఞానం పొందుతున్నారు. అంకె గౌడ స్వయంగా రోజుకు పదిహేను గంటలకు పైగా గ్రంథాలయ నిర్వహణలో నిమగ్నమై ఉంటారు.
దేశవ్యాప్తంగా గుర్తింపు
ఈ గ్రంథాలయాన్ని దేశ విదేశాల నుంచి ప్రముఖులు సందర్శించారు. అనేక పరిశోధనలు, డాక్టరేట్లు ఈ గ్రంథాలయాన్ని ఆధారంగా చేసుకుని పూర్తయ్యాయి. వందలాది వ్యాసాలు ఈ సేవపై ప్రచురితమయ్యాయి.
పద్మశ్రీతో గౌరవం
జ్ఞాన సంరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన అంకె గౌడకు 2026 సంవత్సరానికి పద్మశ్రీ అవార్డు దక్కడం ద్వారా ఆయన సేవలకు దేశస్థాయిలో గుర్తింపు లభించింది. ఇది ఒక వ్యక్తికి మాత్రమే కాదు… పుస్తక ప్రేమకు, జ్ఞాన సేవకు లభించిన గౌరవం.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి