గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా అభివృద్ధి ప్రగతి వివరించిన కలెక్టర్
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా అభివృద్ధి ప్రగతి వివరించిన కలెక్టర్
Biksham
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
77వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో నిర్వహించిన అధికారిక వేడుకల్లో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ప్రసంగించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని వివరించారు.
ప్రపంచంలోనే గొప్ప సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా భారతదేశాన్ని నిలబెట్టిన భారత రాజ్యాంగానికి ఈ రోజు ప్రతీక అని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ నాయకత్వంలో రూపొందిన రాజ్యాంగం పేదలు, అణగారిన వర్గాలు, మహిళలు, మైనారిటీలకు సమాన హక్కులు కల్పించిందని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రం అవతరించి పదకొండున్నర సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధిని లక్ష్యంగా అనేక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో కోట్ల రూపాయల ఆదా జరిగిందని, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా లక్షలాది కుటుంబాలకు లబ్ధి చేకూరిందని చెప్పారు.
సన్న వరిపై రూ.500 బోనస్తో రైతులకు భారీగా మేలు జరిగిందని, వరి ధాన్యం కొనుగోలులో వేలాది రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేసినట్లు వివరించారు. రైతు భరోసా, రైతు బీమా పథకాల ద్వారా రైతులకు భద్రత కల్పించామని తెలిపారు.ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద జిల్లాలో వేల సంఖ్యలో ఇళ్ల నిర్మాణం జరుగుతోందని, ఒక పడక గది ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తవుతోందని అన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం ద్వారా లక్షలాది కుటుంబాలకు లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు.ఆరోగ్య రంగంలో పల్లె దవాఖానాలు, ఆసుపత్రుల అభివృద్ధి, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వేల మందికి వైద్యం అందించామని తెలిపారు. విద్యారంగంలో డిజిటల్ లెర్నింగ్, కొత్త పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్, నవోదయ విద్యాలయం, వ్యవసాయ కళాశాలల ఏర్పాటుతో విద్యా మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నాయని చెప్పారు.
నీరుపారుదల రంగంలో ఎత్తిపోతల పథకాలు, కాలువల ఆధునీకరణతో సాగునీరు అందుబాటులోకి వస్తోందని, రోడ్లు, భవనాలు, పరిశ్రమల అభివృద్ధితో జిల్లా సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకెళ్తోందని కలెక్టర్ వివరించారు.జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, న్యాయవ్యవస్థ, పోలీస్ శాఖ, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలంతా రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ శాంతి, ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి