ఎన్జి కళాశాలలో సామాజిక విప్లవకారుల జయంతులు
ఎన్జి కళాశాలలో సామాజిక విప్లవకారుల జయంతులు
Editor Desk
నాగార్జున ప్రభుత్వ కళాశాలలో సోమవారం సామాజిక విప్లవకారుల జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్టాఫ్ క్లబ్, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహాత్మా జ్యోతిబా ఫులే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ జయంతులను వైభవంగా జరిపారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వైస్ ప్రిన్సిపాల్ డా. పరంగి రవికుమార్ మాట్లాడుతూ—ఈ మహనీయులు కేవలం ఒక వర్గానికో, కులానికో పరిమితం కాకుండా యావత్ భారతదేశానికి ఆదర్శప్రాయులని కొనియాడారు. అణగారిన వర్గాలు, మహిళలకు విద్యను అందించడంలో ఫులే చేసిన కృషి అపారమని గుర్తుచేశారు.
రాజ్యాంగం ద్వారా లభించిన హక్కులను కాపాడుకుంటూ, అంబేద్కర్ సూచించిన “శిక్షణ, సంఘటన, పోరాటం” మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. దేశ రక్షణలో, అణగారిన వర్గాల రాజకీయ సాధికారతలో బాబు జగజ్జీవన్ రామ్ పోషించిన పాత్రను స్మరించుకున్నారు.
పరీక్షల నియంత్రణాధికారి డా. టి. మునిస్వామి మాట్లాడుతూ—చదువుతోనే సాధికారత సాధ్యమని నమ్మిన ఈ మహనీయుల ఆలోచనలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో స్టాఫ్ క్లబ్ కార్యదర్శి సిహెచ్. సుధాకర్, విద్యాత్మిక సమన్వయకర్త బత్తిని నాగరాజు, తెలుగుశాఖ అధ్యక్షులు డా. వెల్దండి శ్రీధర్, మహిళా సాధికారికత విభాగం అధ్యక్షులు డా. జి. భాగ్యలక్ష్మి, రాజనీతి శాస్త్ర విభాగం అధ్యక్షులు డా. ఎ. మల్లేశం, అధ్యాపకులు డా. భట్టు కిరీటం, డా. అనిల్ బొజ్జ, డా. అనిల్ అబ్రహం, కోటయ్య, శంకర్ తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి