దేశ పురోగతిలో అంబేద్కర్ కృషి అనిర్వచనీయం: జస్టిస్ సుదర్శన్ రెడ్డి
దేశ పురోగతిలో అంబేద్కర్ కృషి అనిర్వచనీయం: జస్టిస్ సుదర్శన్ రెడ్డి
Editor Desk
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అంతర్జాతీయ పరిశోధనా కేంద్రం ‘బ్రిడ్జ్’ ప్రారంభం
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
దేశ పురోగతిలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చేసిన కృషి అనిర్వచనీయమని సుప్రీమ్ కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రాంగణంలో బి.ఆర్. అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డైలాగ్ ఆన్ గవర్నెన్స్ అండ్ ఈక్విటీ (BRiiDGE) అంతర్జాతీయ పరిశోధనా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ లోతైన ఆలోచనలు, సమానత్వ భావజాలాన్ని ఈ కేంద్రం ప్రతిబింబిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్య, ఆర్థికశాస్త్రం, పరిపాలన రంగాల్లో అంబేద్కర్ చేసిన సేవలు దేశానికి దిశానిర్దేశం చేశాయని అన్నారు. అంబేద్కర్ అన్వేషించని రచనలపై పరిశోధనలు విస్తరించాలని సూచించారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు మాట్లాడుతూ అణగారిన వర్గాల కోసం అంబేద్కర్ తన జీవితాన్ని అంకితం చేశారని, కులవ్యవస్థకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడారని అన్నారు. రాజ్యాంగంలో ప్రతిఫలించిన సమానత్వ స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు.
విశ్వవిద్యాలయ వైస్చాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి అధ్యక్షత వహిస్తూ బ్రిడ్జ్ కేంద్రం సామాజిక న్యాయం, సమానత్వ లక్ష్యాలతో అవగాహన, విద్యా అంతరాలను తగ్గించే వేదికగా పనిచేస్తుందని తెలిపారు. ఈ కేంద్రాన్ని ఐదేళ్లపాటు కొనసాగించేందుకు ఎస్సీ సబ్ప్లాన్ కింద నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించారు.
గౌరవ అతిథులుగా ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొ. మోలుగరమ్ కుమార్, ఏడీజీపీ జి. సుధీర్ బాబు మాట్లాడారు. అనంతరం కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ అనుపమ రావు జూమ్ ద్వారా ఉపన్యాసం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పలువురు మాజీ వైస్చాన్సలర్లు, విద్యావేత్తలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి