చిట్యాలలో రైస్ మిల్లుల కాలుష్యంపై ప్రజల ఆగ్రహం – మూడు రోజుల్లో చర్యలు లేకపోతే తాళాలు వేస్తామంటూ హెచ్చరిక
చిట్యాలలో రైస్ మిల్లుల కాలుష్యంపై ప్రజల ఆగ్రహం – మూడు రోజుల్లో చర్యలు లేకపోతే తాళాలు వేస్తామంటూ హెచ్చరిక
Editor Desk
చిట్యాల స్థానికం ప్రధాన ప్రధాని
చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని వెంకటేశ్వర పార్బాయిల్డ్ రైస్ మిల్, వెంకటేశ్వర మోడర్న్ రైస్ మిల్ల నుంచి వెలువడుతున్న వాయు, ఘన, ద్రవ కాలుష్యాలతో పట్టణవాసుల జీవనం తీవ్రంగా ప్రభావితమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్యాన్ని నియంత్రించడంలో మున్సిపల్ అధికారులు, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ప్రజా పోరాట సమితి (PRPS) ఆధ్వర్యంలో రైస్ మిల్లుల ఎదుట ధర్నా నిర్వహించారు.చంద్రపురి కాలనీ, సాయి ద్వారకాపురి కాలనీ, ఆదర్శనగర్, ఆటోనగర్, ముత్యాలమ్మ గూడెం, సంజీవనగర్ ప్రాంతాలు ఈ కాలుష్యంతో నిత్యం ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. చంద్రపురి కాలనీ పరిసరాల్లో రైల్వే లైన్ పక్కన ఏర్పాటు చేసిన చెత్త డంప్ యార్డులో రైస్ మిల్లుల నుంచి విడుదలైన కాలుష్యపు నీరు నిల్వ ఉండటంతో దుర్వాసన, దోమల బెడద తీవ్రంగా మారిందన్నారు. శ్వాస తీసుకోవడానికే ఇబ్బందిగా ఉందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.మూడు రోజుల్లో కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోకపోతే రెండు రైస్ మిల్లులకు తాళాలు వేసి కార్యకలాపాలు నిలిపివేస్తామని PRPS రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి హెచ్చరించారు. మిల్లుల యాజమాన్యాలు బాధ్యతగా వ్యవహరించాలని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడవద్దని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మూడు జిల్లాల కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకన్నతో ఫోన్లో మాట్లాడగా, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి కాలుష్యాన్ని నియంత్రించే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఆ హామీ నేపథ్యంలో ధర్నాను తాత్కాలికంగా విరమించారు.
ధర్నాలో కాలనీ మహిళలు, బాలబాలికలతో పాటు చేపూరి శ్రీనివాస్ నేత, మారగొని యాదగిరి గౌడ్, రుద్రారపు నరసింహ, రుద్రారపు కిష్టయ్య, ఆదిరెడ్డి, నరసింహ, రావిడి సత్తిరెడ్డి, బిల్లపాటి అలివేలు, మారగోని జ్యోతి, రుద్రారపు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి