చదువు అన్నీ నేర్పించదు
చదువు అన్నీ నేర్పించదు
Editor Desk
టీఎన్ శేషన్ చెప్పిన అనుభవం… ఉన్నత పదవులకూ మించిన మనుష్యత పాఠం
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
ఒక సందర్భంలో దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేసిన టీఎన్ శేషన్, భార్యతో కలిసి ఉత్తరప్రదేశ్లోని ఓ ప్రాంతానికి పిక్నిక్కు వెళ్తుండగా మార్గమధ్యంలో పిచ్చుక గూళ్లతో నిండిన పెద్ద మామిడి తోటను చూశారు. ఆ గూళ్లను చూసి ముచ్చటపడిన శేషన్ భార్య, రెండు గూళ్లను ఇంటికి తీసుకెళ్లాలనే ఆలోచన వ్యక్తం చేశారు.దగ్గర్లో ఆవులను మేపుతున్న ఓ యువకుడిని పిలిపించి, పిచ్చుక గూళ్లను తీసిస్తే డబ్బు ఇస్తామని పోలీసు ఎస్కార్ట్ ఆశ చూపింది. తొలుత 10 రూపాయలు, ఆ తర్వాత 50 రూపాయల వరకు ఆఫర్ పెరిగింది. పోలీసుల ఆదేశాలు ఉన్నప్పటికీ ఆ యువకుడు మాత్రం గూళ్లను తీయడానికి నిరాకరించాడు.
“మీరు ఎంత డబ్బు ఇచ్చినా గూళ్లను తీసి ఇవ్వలేను. ఆ గూళ్లలో ఉన్న పిల్ల పిచ్చుకల పరిస్థితి ఏమవుతుంది? సాయంత్రం తల్లి పిచ్చుక ఆహారం తెచ్చుకుని వచ్చి పిల్లలు కనిపించకపోతే ఆమె పడే బాధ ఎవరు భరిస్తారు?” అని ఆ యువకుడు ప్రశ్నించాడు.
ఈ మాటలు విన్న శేషన్ దంపతులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అనంతరం ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ టీఎన్ శేషన్ మాట్లాడుతూ,
“నా పదవి, నా హోదా, నా చదువు, నా ఐఏఎస్ అన్నీ కూడా ఆ ఆవులను కాసే యువకుడి విజ్ఞత ముందు చిన్నబోయాయి. విద్య, స్థానం, సామాజిక హోదా అన్నవి మానవత్వం ముందు నిలబడలేవు. ఈ సంఘటన మమ్మల్ని రోజులు తరబడి అపరాధభావంతో వెంటాడింది” అని పేర్కొన్నారు.పదవులు, కుర్చీలు మనిషికి గౌరవం తీసుకురావు… మనిషి వ్యక్తిత్వం, విజ్ఞత వల్లే ఆ పదవికే గౌరవం వస్తుందన్న సత్యాన్ని ఈ సంఘటన స్పష్టం చేస్తుందని శేషన్ వ్యాఖ్యానించారు. ఉన్నత స్థాయిలో ఉన్నవారు సమాజానికి ఉపయోగపడేలా ఆలోచించాలి, మానవత్వంతో నిర్ణయాలు తీసుకోవాలే గానీ, అహంకారంతో ప్రవర్తించడం మూర్ఖత్వమేనని స్పష్టం చేశారు.మేనేజ్మెంట్ సెమినార్లో విద్యార్థులతో పంచుకున్న ఈ అనుభవం, చదువుకంటే మించిన విలువలు ఉన్నాయనే విషయాన్ని గుర్తుచేసే గొప్ప జీవిత పాఠంగా నిలిచింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి