బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రత్యేక దృష్టి
బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రత్యేక దృష్టి
Editor Desk
రోడ్డు ప్రమాదాల నివారణకు మరింత పటిష్ట చర్యలు అవసరం
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు మరిన్ని పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హాలులో నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రతా సమీక్ష సమావేశంలో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమగ్రంగా చర్చించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. గత ఏడాది రోడ్డు ప్రమాదాల వల్ల 204 మంది ప్రాణాలు కోల్పోగా, ఈ సంవత్సరం 174 మంది మాత్రమే మరణించడం జరిగిందని వెల్లడించారు. అయినప్పటికీ ప్రమాదాల నివారణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా మరింత సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
జిల్లాలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత సమావేశంలో గుర్తించిన బ్లాక్ స్పాట్స్ వద్ద ఇప్పటివరకు చేపట్టిన చర్యలు ఏమిటి, ఇంకా ఏ చర్యలు అవసరమో వివరించాలని ఆదేశించారు. ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో స్పష్టమైన సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని, వాహనాల వేగ నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో కారణాలను లోతుగా విశ్లేషించి, ప్రాణ నష్టం జరగకుండా నివారణ చర్యలు అమలు చేయాలని ఆదేశించారు. నేషనల్ హైవే అథారిటీ, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు రోడ్డు భద్రతా సమావేశాల్లో చర్చించిన అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ సమావేశంలో ఏఎస్పీ రాహుల్ రెడ్డి జిల్లాలో ఎక్కువగా ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లపై వివరాలు వెల్లడించారు.
సమీక్ష సమావేశంలో ట్రాఫిక్ ఏసిపి ప్రభాకర్ రెడ్డి, ట్రాన్స్పోర్ట్ అధికారి సాయి కృష్ణ, రోడ్లు భవనాల శాఖ అధికారి సరిత, ఆర్టీఏ నర్సింహా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి