Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 03:20 AM

బిఆర్ఎస్‌లో చేరికలతో కుదిపిన చిట్యాల రాజకీయం

బిఆర్ఎస్‌లో చేరికలతో కుదిపిన చిట్యాల రాజకీయం

బిఆర్ఎస్‌లో చేరికలతో కుదిపిన చిట్యాల రాజకీయం
January 27, 2026 03:56 PM 941 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

కాంగ్రెస్‌కు గట్టి దెబ్బ

నకిరేకల్‌లో యాభై కుటుంబాల బిఆర్ఎస్‌లో చేరిక

స్థానికం ప్రధాన ప్రతినిధి

నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. చిట్యాల మున్సిపాలిటీ రెండో వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ షబానా అజీముద్దీన్‌తో పాటు ఆ పార్టీకి చెందిన యాభై కుటుంబాలు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి నేడు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం పట్టణ కేంద్రంలోని రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పూర్తిగా కుంటుపడ్డాయని ఆరోపించారు. డైవర్షన్ రాజకీయాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ భవితవ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడని వ్యాఖ్యానించారు.

మార్పు పేరుతో ప్రజలను నమ్మించి ఓట్లు తీసుకుని, అధికారంలోకి వచ్చాక ప్రజలను నట్టేట ముంచిందని కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు. కొత్త పథకాలు తీసుకురాకపోవడమే కాకుండా, బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను రద్దు చేసి పేదల పొట్టకొడుతోందని విమర్శించారు. బాలింతలకు ఆసరాగా నిలిచిన కేసీఆర్ కిట్ పథకాన్ని పూర్తిగా నిలిపివేయడం దారుణమని అన్నారు.

సన్నబియ్యం పథకం కేసీఆర్ హయాంలోనే ప్రారంభమైందని, గురుకుల విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం అందించిన చరిత్ర బిఆర్ఎస్‌కే దక్కుతుందని స్పష్టం చేశారు. చదువుకున్న విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచిపోయారని ఆరోపించారు. బతుకమ్మ పండుగకు కేసీఆర్ అందించిన చీరలను పేరుమార్చి పంపిణీ చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు.

గ్రామాల్లో అభివృద్ధి లేదని, సంక్షేమం లేదని, ప్రజలకు భద్రత, రక్షణ కూడా లేకుండా పోయిందని విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్ నాయకులు ప్రజల గడప తడుతున్నారని, ఓట్లు, సీట్లు తప్ప పేద ప్రజల కష్టాలు వారికి పట్టవని వ్యాఖ్యానించారు.

రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని నకిరేకల్ పట్టణ ప్రజలను మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పిలుపునిచ్చారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News