ఐదు నిమిషాల్లో ‘నో స్టాక్’... వెలిమినేడు పిఎసిఎస్ వద్ద రైతుల ఆగ్రహం
ఐదు నిమిషాల్లో ‘నో స్టాక్’... వెలిమినేడు పిఎసిఎస్ వద్ద రైతుల ఆగ్రహం
Komidala Mahender reddy
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలోని పిఎసిఎస్ కేంద్రం వద్ద గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎరువుల కొరతతో ఇప్పటికే ఆందోళనలో ఉన్న రైతులకు యూరియా సరఫరాలో జరిగిన గందరగోళం మరింత ఆగ్రహాన్ని రగిలించింది.స్థానిక పిఎసిఎస్ సెంటర్కు 550 యూరియా బస్తాలు చేరినట్టు సమాచారం అందడంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు ఉదయం నుంచే కేంద్రం వద్దకు తరలివచ్చారు. అయితే యూరియాను ఆన్లైన్లో నమోదు చేసిన కేవలం ఐదు నిమిషాలకే ‘నో స్టాక్’గా చూపించడంతో రైతులు షాక్కు గురయ్యారు. స్టాక్ వచ్చి వెంటనే ముగిసిపోవడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు.
“మాకు ఆన్లైన్లో బుక్ చేసుకోవడం తెలియదు. వ్యవస్థను సులభంగా అర్థం చేసుకునేలా చేయకుండా, రైతులను దూరం పెట్టే విధంగా మారింది” అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు రైతులు పిఎసిఎస్ గేట్కు తాళం వేసి నిరసనకు దిగారు. ఆన్లైన్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి, స్థానిక రైతులకు ప్రత్యక్షంగా ఎరువులు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రైతుల ఆరోపణల ప్రకారం, పిఎసిఎస్ పరిధిలోని రైతులకు కాకుండా ఇతర ప్రాంతాల వారు ముందుగానే బుక్ చేసుకుని యూరియాను పొందుతున్నారని అంటున్నారు. దీంతో సీజన్ కీలక దశలో ఉన్న పంటలకు ఎరువులు అందక స్థానిక రైతులు నష్టపోతున్నారని వాపోయారు.
విషయం తెలిసి సంబంధిత అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపినట్లు సమాచారం. సరఫరా విధానంపై స్పష్టత ఇవ్వాలని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రైతులు హెచ్చరించారు. సాగు వేళలో ఎరువుల లభ్యత కీలకమని, సరఫరాలో పారదర్శకత లేకపోతే రైతాంగంతీవ్రఇబ్బందులుఎదుర్కొంటుందనినిపుణులుఅభిప్రాయపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి