అధిక శబ్దంతో ప్రయాణిస్తే ఉపేక్షించేది లేదు!
అధిక శబ్దంతో ప్రయాణిస్తే ఉపేక్షించేది లేదు!
NM Yadav
నల్లగొండలో రోడ్ రోలర్తో 72 సైలెన్సర్ల ధ్వంసం..
నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు..
లైసెన్సులు రద్దు చేస్తామని అదనపు ఎస్పీ రమేష్ హెచ్చరిక..
నల్లగొండ : రహదారులపై వెళ్తూ చెవులు చిల్లులు పడేలా శబ్దకాలుష్యం సృష్టిస్తున్న వాహనదారులపై నల్లగొండ జిల్లా పోలీసులు కొరడా ఝుళిపించారు. నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలకు అమర్చిన 72 మాడిఫైడ్ సైలెన్సర్లను బుధవారం పట్టణంలోని క్లాక్ టవర్ కూడలి వద్ద రోడ్ రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు గత కొన్ని రోజులుగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. కంపెనీ ఇచ్చిన సైలెన్సర్లను కాదని అధిక శబ్దం వచ్చేలా మార్పులు చేసిన వాహనాలను గుర్తించి వాటి నుంచి సైలెన్సర్లను తొలగించారు. అదనపు ఎస్పీ రమేష్ పర్యవేక్షణలో వీటిని బహిరంగంగా ధ్వంసం చేయడం ద్వారా వాహనదారుల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. యువత మోజుతో సైలెన్సర్లను మార్చి సామాన్య ప్రజలను, ముఖ్యంగా వృద్ధులు, రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.ఇకపై మాడిఫైడ్ సైలెన్సర్లతో దొరికితే సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, పదేపదే నిబంధనలు అతిక్రమిస్తే డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేయడంతో పాటు వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు.
ఎవరైనా అధిక శబ్దంతో వాహనాలు నడుపుతూ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, టూ టౌన్ సీఐ రాఘవ రావు, ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య, వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్.ఐలు సైదులు, సైదా బాబు, రాజీవ్ రెడ్డి తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి