అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి విశ్రాంత అధ్యాపకులే బలస్తంభం
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి విశ్రాంత అధ్యాపకులే బలస్తంభం
స్థానికం బృందం
అనుభవాన్ని వదులుకోం : ఉపకులపతి ఘంటా చక్రపాణి
హైదరాబాద్, స్థానికం ప్రధాన ప్రతినిధి
విశ్వవిద్యాలయ సర్వతోముఖాభివృద్ధికి విశ్రాంత అధ్యాపకుల అనుభవమే కీలకమని, వారి సూచనలు–సలహాలు యూనివర్సిటీ ప్రగతికి దారిచూపుతాయని డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి స్పష్టం చేశారు.
శనివారం యూనివర్సిటీలో నిర్వహించిన విశ్రాంత అధ్యాపకుల వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు.
యూనివర్సిటీ విద్య, పరిశోధన, పాలన రంగాల్లో వేగంగా ముందుకు సాగుతోందని, ఈ సమయంలో గతంలో బోధనతో పాటు పాలనా బాధ్యతలు నిర్వర్తించిన విశ్రాంత అధ్యాపకుల సలహాలు అత్యంత అవసరమని పేర్కొన్నారు.
విశ్రాంత అధ్యాపకుల కోసం యూనివర్సిటీ ప్రాంగణంలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఉపకులపతి వెల్లడించారు. పరిశోధన చేస్తున్న విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడం, యూనివర్సిటీ విధానాలపై సలహాలు ఇవ్వడం ద్వారా విశ్రాంత అధ్యాపకులు మళ్లీ చురుగ్గా భాగస్వాములు కావాలని ఆయన కోరారు.ఈ సందర్భంగా విశ్రాంత అధ్యాపకుల సంక్షేమ సంఘం ఉపకులపతి ప్రొఫెసర్ ఘంటా చక్రపాణిని ఘనంగా సన్మానించింది.
ఈ సమావేశంలో మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ వి.ఎస్. ప్రసాద్, సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎస్.వి. రాజశేఖర్ రెడ్డి, కార్యదర్శి ప్రొఫెసర్ సి. వెంకటయ్య, మాజీ రెక్టర్ ప్రొఫెసర్ కుప్పుస్వామి రావు, మాజీ రిజిస్ట్రార్లు డా. జి. లక్ష్మారెడ్డి, డా. పి. కృష్ణారావు, మాజీ డైరెక్టర్లు ప్రొఫెసర్ రామయ్య, డా. పి. విజయలక్ష్మి పండిట్, డా. బనోత్ లాల్, ప్రొఫెసర్ ఎం.ఎస్. హయత్, ప్రొఫెసర్ సరస్వతీరావు, మల్లా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి