ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ గడువు పెంపు
ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ గడువు పెంపు
GADDAM JAGANMOHAN REDDY
గృహ వినియోగ వంటగ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సిలిండర్ బుకింగ్ల మధ్య ఉండే గడువును 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది.
ఇటీవల సిలిండర్ల కొరత వస్తుందనే భయంతో కొందరు వినియోగదారులు ముందస్తుగా బుకింగ్లు చేస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. సాధారణంగా 55 రోజులకోసారి సిలిండర్ బుక్ చేసుకునే వినియోగదారులు కూడా ప్రస్తుతం 15 రోజుల్లోనే మళ్లీ బుకింగ్ చేస్తున్నారని అధికారులు తెలిపారు. దీంతో గతంలో 21 రోజుల లాక్-ఇన్ నిబంధనను అమలు చేసిన ప్రభుత్వం, తాజాగా ఆ గడువును 25 రోజులకు పెంచింది.
ఇదిలా ఉండగా, గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్పై ఇటీవల కేంద్రం రూ.60 ధర పెంపు చేసింది. వాణిజ్య సిలిండర్లపై రూ.114.50 వరకు ధరలు పెరిగాయి. మరోవైపు గృహ వినియోగదారులకు ఎల్పీజీ సరఫరా ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని ఆయిల్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కమర్షియల్ వినియోగదారుల కంటే గృహ వినియోగదారులకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.
అలాగే ఎల్పీజీ సరఫరా కోసం అల్జీరియా, ఆస్ట్రేలియా, కెనడా, నార్వే వంటి దేశాలు ముందుకు వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ఆలోచన లేదని తెలిపాయి. దేశంలో పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ నిల్వలు ప్రస్తుతం సరిపడా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి