ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థల రద్దు? – రాజ్యాంగ అడ్డంకులు, రాజకీయ ప్రతిఘటనలు
ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థల రద్దు? – రాజ్యాంగ అడ్డంకులు, రాజకీయ ప్రతిఘటనలు
GADDAM JAGANMOHAN REDDY
హైదరాబాద్,
తెలంగాణలో స్థానిక సంస్థల పునర్వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలు రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థలను రద్దు చేసే దిశగా ప్రభుత్వం పరిశీలన జరుపుతోందనే ప్రచారం ఊపందుకుంది.
ప్రస్తుత మూడు స్థాయిల పంచాయతీరాజ్ వ్యవస్థ వల్ల అధికార యంత్రాంగం క్లిష్టంగా మారుతోందని, నిధుల వినియోగంలో జాప్యం జరుగుతోందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. మధ్యంతర స్థాయి రాజకీయ వ్యవస్థలను తొలగించి, గ్రామ పంచాయతీ సర్పంచులు మరియు జిల్లా స్థాయి పరిపాలన మధ్య ప్రత్యక్ష సమన్వయం ఏర్పరచాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది.
పరిషత్లకు పరిమిత అధికారాలు
మండల పరిషత్, జిల్లా పరిషత్ సభ్యులకు కేటాయించే నిధులు పరిమితంగా ఉండటంతో వారి పాత్ర తగ్గిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంపీటీసీలకు తగిన అధికారాలు లేకపోవడం వల్ల అసంతృప్తి నెలకొన్నదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఈ వ్యవస్థను రద్దు చేయడం ద్వారా పాలనాపరమైన ఖర్చులు తగ్గి, నిర్ణయాల ప్రక్రియ వేగవంతమవుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
రాజ్యాంగ పరిమితులు అడ్డంకి?
భారత రాజ్యాంగంలోని 73వ సవరణ ప్రకారం గ్రామ, మధ్యంతర, జిల్లా స్థాయిలతో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అమలులో ఉండాలి. ఈ నిర్మాణంలో మార్పులు చేయాలంటే రాష్ట్ర శాసనసభతో పాటు కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్ ఆమోదం అవసరం. కేవలం రాష్ట్ర నిర్ణయంతో ఈ వ్యవస్థలను రద్దు చేయడం సాధ్యం కాదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రాజకీయంగా ప్రతిఘటన తప్పదా?
పరిషత్ల రద్దు ప్రతిపాదనపై విపక్షాలు తీవ్రంగా స్పందించే అవకాశముంది. స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం కలిగిన నేతలు దీనిని ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా అభివర్ణించే సూచనలు ఉన్నాయి. గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే ఈ నిర్ణయానికి అన్ని పార్టీల మద్దతు లభించడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి