నిస్సహాయుల సంక్షేమమే నిజమైన అభివృద్ధి. బాల భరోసా, ప్రణామ్ పథకాల ప్రారంభోత్సవంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ.
నిస్సహాయుల సంక్షేమమే నిజమైన అభివృద్ధి. బాల భరోసా, ప్రణామ్ పథకాల ప్రారంభోత్సవంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ.
Sandeep journalist
రూ. 43 కోట్లతో 7 వేల మంది దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ.
వృద్ధుల కోసం డే కేర్ సెంటర్ల ఏర్పాటు.
0-5 ఏండ్ల పిల్లల్లో ఎదుగుదల.
లోపాలను గుర్తించేందుకు స్క్రీనింగ్.
హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ధి అంటే కేవలం ఆకాశహర్మ్యాలు, పరిశ్రమల స్థాపన మాత్రమే కాదు అని.. సమాజంలోని అభాగ్యులకు, నిస్సహాయులకు భరోసా కల్పించడమే నిజమైన ప్రగతి అని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఆ దిశగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో సోమవారం జరిగిన బాల భరోసా, ప్రణామ్ కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనిషి పుట్టుక నుంచి వృద్ధాప్యం వరకు ప్రతి దశలోనూ పౌరులకు అండగా నిలవడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. సమాజంలో పిల్లలు, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమం కోసం ఒకే వేదికపై మూడు కీలక కార్యక్రమాలను చేపట్టడం సంతోషంగా ఉందన్నారు.
*పసిప్రాయంలోనే పటిష్టమైన ఆరోగ్య భద్రత*
భావి భారత పౌరులు ఆరోగ్యంగా ఎదగాలన్న సంకల్పంతో బాల భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మంత్రి తెలిపారు. అప్పుడే పుట్టిన పిల్లలు నుంచి 5 ఏళ్ల లోపు వయసున్న చిన్నారుల్లో శారీరక, మానసిక లోపాలను ప్రాథమిక దశలోనే గుర్తించి నివారించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల ద్వారా ఇప్పటికే సుమారు 18 లక్షల మంది పిల్లలకు స్క్రీనింగ్ నిర్వహించామని, లోపాలున్న వారికి వైద్య నిపుణులతో పరీక్షలు చేయించి ఉచిత చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. తద్వారా భవిష్యత్తులో వారు దివ్యాంగులుగా మారే ప్రమాదాన్ని అరికట్టవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షనల్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు.
*జన్యు వ్యాధులపై సమరం*
తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా, హీమోఫీలియా వంటి జన్యుపరమైన వ్యాధుల నివారణపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి వెల్లడించారు. తల్లిదండ్రులను మానసికంగా, ఆర్థికంగా కుంగదీసే ఈ వ్యాధులను పిండ దశలోనే గుర్తించేందుకు గర్భిణులకు HbA1 స్క్రీనింగ్ పరీక్షను తప్పనిసరి చేస్తున్నామన్నారు. వ్యాధిగ్రస్తులైన చిన్నారులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామని, ఖరీదైన బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ వంటి చికిత్సలను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యాధులతో బాధపడుతున్న పిల్లల కోసం తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించానని మంత్రి వెల్లడించారు. తలసేమియా ఫ్రీ తెలంగాణ కోసం సీఎం నాయకత్వంలో పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు.
*వృద్ధులకు ప్రణామ్*
మారుతున్న జీవనశైలి, మైక్రో కుటుంబాల నేపథ్యంలో ఒంటరితనంతో బాధపడుతున్న వృద్ధులకు ఊరటనిచ్చేలా ప్రణామ్ డే కేర్ సెంటర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మంజూరైన 37 కేంద్రాల్లో, నేడు 18 కేంద్రాలను ప్రారంభించామన్నారు. మారిన జీవనశైలిలో తమ తల్లిదండ్రులను పిల్లలు కొంత నిర్లక్షం చేస్తున్నారని, అలాంటి వారికి తాము అండగా ఉంటామని మంత్రి భరోసానిచ్చారు. ప్రణామ్ కేంద్రాల్లో తమ సమవయస్కులతో వృద్ధులు కాలక్షేపం చేయవచ్చన్నారు. ఇక్కడ గ్రంథాలయం, ఇండోర్ గేమ్స్, టీవీ, ఇంటర్నెట్ సౌకర్యాలతో పాటు ఉచితంగా అల్పాహారం, వేడివేడి మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు వివరించారు. అంతేకాకుండా, ఈ కేంద్రాలను జెరియాట్రిక్ కేర్ సెంటర్లతో అనుసంధానించి వృద్ధులకు అవసరమైన వైద్య సేవలను కూడా అందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.
*దివ్యాంగులకు ఆత్మగౌరవ కానుక*
దివ్యాంగులు ఎవరిపైనా ఆధారపడకుండా స్వావలంబనతో జీవించేందుకు ప్రభుత్వం తోడ్పాటునందిస్తోందని దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఇందులో భాగంగా సుమారు 7 వేల మందికి రూ. 43 కోట్ల విలువైన అత్యాధునిక పరికరాలను పంపిణీ చేశామన్నారు. రెట్రోఫిటెడ్ వాహనాలు, బ్యాటరీ ట్రైసైకిళ్లు, వీల్ఛైర్లు, ల్యాప్టాప్లు, 4జీ మొబైల్ ఫోన్లు, వినికిడి యంత్రాలు అందించడం ద్వారా వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించామన్నారు. సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రస్థానంలో అన్ని వర్గాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పునరుద్ఘాటించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి