హైదరాబాద్: మండుతున్న ఎండల మధ్య తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు అందించింది. రాష్ట్రంలో వచ్చే ఆరు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నేటి నుంచి ఈనెల 21 వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వెల్లడించారు.
మొదటగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, నల్గొండ, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. మంగళవారం, బుధవారం నాటికి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరికొన్ని ప్రాంతాలకు వర్షాలు విస్తరించే అవకాశముందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల లోపు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.
మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ఒక ద్రోణి కొనసాగుతుండటమే ఈ వర్షాలకు కారణమని వాతావరణశాఖ అధికారులు వివరించారు. ఈ ప్రభావంతో ఈనెల 21 వరకు రాష్ట్రంలో ఎండల తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఆదివారం ఉదయం నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండగా, హైదరాబాద్ సహా కొన్ని ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షాలు కొంత ఉపశమనం కలిగించాయి.
ఎండల తీవ్రతకు బ్రేక్
ఈ ఏడాది తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాధారణంగా మార్చి మొదటి వారం నుంచి ఎండల తీవ్రత పెరుగుతుంటుంది. అయితే ఈసారి ఫిబ్రవరి రెండో వారం నుంచే ఎండలు తీవ్రంగా మండడం ప్రారంభమైంది. మార్చి ప్రారంభానికి చాలా జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదయ్యాయి.
ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండలు మండిపోతుండగా మధ్యాహ్నం సమయాల్లో నగరాలు, పట్టణాల్లో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. పగటిపూట ఎండలు ఎక్కువగా ఉండగా రాత్రిపూట కూడా ఉక్కపోత ప్రజలను ఇబ్బంది పెడుతోంది. దీంతో ప్రజలు ఏసీలు, కూలర్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా పెరిగింది.
ఇలాంటి పరిస్థితుల్లో ఆరు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ ప్రకటించడంతో ప్రజలకు కొంత ఊరట లభించినట్లు అయ్యింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి